Date of Publish : 21 May 2025, 10:53 amPosted by : SHIVASURYA NEWS
కార్యకర్తల బాధ్యత నాదే –నారా లోకేష్
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇకపై కార్యకర్తలను నేరుగా కలుసుకోవాలని మంత్రి నిర్ణయం తీసుకున్నారు. వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
కార్యకర్తల బాధ్యత తనది అని, పార్టీ కోసం కష్టపడిన వారి ఇంటికి పెద్దకొడుకులా అండగా ఉంటా అని మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) హామీ ఇచ్చారు. వైసీపీ గూండాల చేతిలో హత్యకు గురైన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని వారితో భేటీ అయ్యారు మంత్రి. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. అలవాల గ్రామానికి చెందిన వెన్నా బాలకోటిరెడ్డి నాలుగు దశాబ్దాలుగా పార్టీ పటిష్టత, ప్రజా సంక్షేమ కోసం పనిచేశారన్నారు.
దీనిని ఓర్వలేని వైసీపీ గూండాలు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అండతో ఇంట్లో నిద్రిస్తున్న వెన్నా బాలకోటిరెడ్డిని తుపాకీతో కాల్చి చంపారని మండిపడ్డారు. హత్యకు ఆరు నెలల ముందు కత్తులతో దాడికి యత్నించగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని.. రక్షణ కోసం పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు. హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని మంత్రి అన్నారు. కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానని ఈ సందర్భంగా మంత్రి భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమన్నారు. ఇకపై కార్యకర్తలను నేరుగా కలుసుకోవాలని మంత్రి లోకేష్ నిర్ణయం తీసుకున్నారు.