SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 01 June 2025, 1:15 pm Posted by : SHIVASURYA NEWS

ఏపీ ప్రభుత్వం కోవిడ్ అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయని ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని, కాబట్టి తాము అందిస్తున్నట్లు సూచనల్ని పాటించాలని మంత్రి కొలుసు పార్ధసారధి ప్రకటించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఈ మేరకు ప్రజలతో పాటు వైద్యులు, ఆస్పత్రులు, వృద్ధులు, గర్భిణీలకు పాటించాల్సిన సూచనలు వెల్లడించారు

దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్ననందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. సమూహాలుగా ఏర్పడే కార్యక్రమాలు చేయొద్దని, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఎయిర్ పోర్టులో సోషల్ డిస్టెన్స్, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. వృద్ధులు, గర్భవతులు ఇళ్ల నుంచి అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారు కొవిడ్ టెస్ట్ తప్పనిసరిగా చేసుకోవాలన్నారు.

మాస్కులు, పీపీ,ఈ కిట్లు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పార్ధసారధి వైద్యాధికారుల్ని ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్ ను ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని, మెరుగైన వైద్యానికి వైద్యపరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలని వైద్యాధికారులకు ఆదేశించారు.

ప్రత్యేక పర్యవేక్షణతో సమన్వయంతో అధికారులు పనిచేయాలన్నారు. కోవిడ్ ను ఎదుర్కోవడానికి గ్రామ, మండల స్థాయి ప్రభుత్వ అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించి తగిన జాగ్రత్తలు తీసుకొనేలా చూడాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని మంత్రి సూచించారు. ప్రజలంతా మాస్క్, శానిటేషన్, తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనవచ్చన్నారు.