జయజయహే : టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి హత్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. వీరయ్య హత్యను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. తాను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వార్త తెలిసిందని చెప్పారు. హత్య చేసిన నిందితులను పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 12 బృందాలతో దర్యాప్తు చేయిస్తున్నామన్నారు కరుడుగట్టిన నేరస్తులతో వీరయ్యను హత్య చేయించారని, 53 కత్తిపోట్లు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. ఇలాంటివి చూసినప్పుడు రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరయ్య చౌదరి మంచి నాయకుడు, సమర్థమైన వ్యక్తి అని సీఎం కీర్తించారు. యువగళం సమయంలో 100 రోజులు లోకేష్తో తిరిగారని గుర్తు చేశారు. అమరావతి రైతుల పాదయాత్ర సమయంలోనూ రైతులకు అండగా నిలబడ్డాడన్నారు. ఎన్నికల సమయంలో చీరాల, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో వీరయ్య చౌదరి పని చేశారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘోరాలు జరగడం జీర్ణించుకోలేకపోతున్నానని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. సీసీటీవీ కెమెరాల నుండి క్లూస్ కూడా తీసుకుంటున్నామని.. ఎవరికైనా హత్యపై సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 9121104784 కి సమాచారం ఇవ్వాలని ప్రజలకు సీఎం సూచించారు. హత్యా రాజకీయాలు చేసే వాళ్ళు కూడా చివరకు కాలగర్భంలో కలిసిపోతారన్నారు. నేరగాళ్లను పట్టుకుని తీరుతామని.. కఠిన శిక్ష విధిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. తమ కుటుంబ సభ్యుల్లాగా వీరయ్య కుటుంబాన్ని చూసుకుంటామన్నారు. నేర రాజకీయాలు చేసేవాళ్లను తుదముట్టించే వరకు పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రం నేరస్థుల అడ్డాగా మారకూడదని.. హత్యలు చేయడం దుర్మార్గమైన పని అని అన్నారు. హత్య కేసును ఛేదించే వరకు పోలీస్ వ్యవస్థ నిద్రపోదన్నారు. రాజకీయ కోణం, వ్యాపారం, ఆయన ఎదుగుదల జీర్ణించుకోలేక పోవడం లాంటి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. నేరస్తులు భూమి మీద ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి భౌతికకాయానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
Homeశివ సూర్య డైలీఎక్కడున్నా వదిలిపెట్టం వీరయ్య హత్యను జీర్ణించుకోలేకున్నా నిందితుల కోసం 12 టీమ్ లు రంగంలోకి...
ఎక్కడున్నా వదిలిపెట్టం వీరయ్య హత్యను జీర్ణించుకోలేకున్నా నిందితుల కోసం 12 టీమ్ లు రంగంలోకి సీఎం చంద్రబాబు హెచ్చరిక
0
36
RELATED ARTICLES

