
ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో భద్రతపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ నిన్న ఏపీ సీఎస్, డీజీపీలకు లేఖలు రాసిన పవన్.. ఇవాళ మరోసారి జాతీయ మీడియాతో ఇదే అంశంపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న రోహింగ్యాల ముప్పుపైనా పవన్ ఆందోళన వ్యక్తం చేశారు.
సరిహద్దుల్లో సైనికులు ఎంత భద్రంగా దేశాన్ని రక్షిస్తున్నారో, దేశం లోపల అంతర్గత భద్రతలో పోలీసు శాఖ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండటం కీలకమని పవన్ తెలిపారు. దీనిపైనే రాష్ట్ర పోలీసులను, పరిపాలన సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తూ లేఖ రాశానని పవన్ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నితమైన లక్ష్యం అని గతంలో జరిగిన కిరాతక దాడుల్లో తేలిందన్నారు. కోయంబత్తూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడులు తల్చుకుంటే ఇప్పటికీ గుండె తరుక్కుపోతుందన్నారు.
సరిహద్దుల్లో భద్రతా సిబ్బంది ఎంత అప్రమత్తంగా ఉంటారో, రాష్ట్ర పోలీసులు కూడా అంతర్గత భద్రతపై అంతే సీరియస్ గా దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉగ్రవాదుల జాడలు కనిపించిన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని తాను లేఖ ద్వారా డీజీపీని కోరినట్లు గుర్తుచేశారు. పాలనా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని ఉగ్రవాద జాడలు కలిగిన వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించానన్నారు. ముఖ్యంగా వలసదారుల విషయంలో తగిన నిఘాను ఉంచితే జరగబోయే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. అలాగే తీర ప్రాంతంలో సైతం నిరంతర పర్యవేక్షణ, నిఘా పెంచుకోవాల్సిన అవసరం ఉందని పవన్ తెలిపారు. గతంలోనూ కాకినాడలో బయట వ్యక్తులు బోట్లలో వచ్చినట్లు కొన్ని వార్తలు వచ్చాయని, తీరంలో కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా తీరంలో కొత్త వ్యక్తుల కదలికలు, వారి చర్యలను గమనించాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు అజాగ్రత్తగా ఉండకుండా అంతర్గత భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసిన సంయుక్త ఆపరేషన్ లోనూ రాష్ట్రంలో కొన్ని ఉగ్రవాద జాడలు కనిపించినట్లు తెలుస్తోందన్నారు.

