SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 24 April 2025, 6:15 am Posted by : SHIVASURYA NEWS

ఉగ్రదాడి సూత్రధారి సైఫుల్లా ఖలీద్..? గుర్తించిన నిఘా వర్గాలు వేటాడుతున్న భద్రతా బలగాలు

జయజయహే : జమ్మూకశ్మీర్‌లోని హల్గాం లో 26 మంది పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రదాడి వెనుక ప్రధాన సూత్రధారి ఎవరనే కీలక సమాచారం వెలుగుచూసింది. లష్కరే తొయిబా టాప్ కమాండర్ సైఫుల్లా ఖలీద్ ఈ ఘటన వెనుక ప్రధాన సూత్రధారిగా ఆర్మీ వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్రదాడికి రెండు నెలల నుంచి సైఫుల్లా ఖలీద్ అలియాస్ సైఫుల్లా కసూరి ప్లాన్ చేస్తున్నాడని, తన ప్లానింగ్ సజావుగా అమలు చేసేందుకు గత రెండు నెలల్లో రెండు సార్లు పాకిస్థాన్ ఆర్మీ క్యాంప్స్‌కు వెళ్లాడని భారత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. భారత ఆర్మీ వర్గాల సమాచారం ప్రకారం, లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌‌కు సైఫుల్లా ముఖ్య సహచరుడుగా వ్యవహరిస్తు్న్నాడు. లష్కరేకి ప్రాక్సీగా చెప్పుకునే ‘ది రిసిస్టెన్స్ ఫ్రంట్‌’ (టీఆర్ఎఫ్), పీపుల్స్ యాంటీ-ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఏఎఫ్ఎఫ్)లను స్థాపించినది కూడా ఇతనే. భారత్‌కు వ్యతిరేకంగా చేపట్టిన పలు ఉగ్రవాద కార్యకలాపాలతో సైఫుల్లా ప్రమేయం ఉంది. ఇతనికి హఫీజ్ సయీజ్‌తా పాటు పాకిస్థాన్ మిలటరీ సపోర్ట్ బలంగా ఉంది. పాకిస్థాన్ ఆర్మీ, ఐఎస్ఐ ఇటీవల ఖైబర్ ఫఖ్తుంక్వాలో నిర్వహించినట్టు చెబుతున్న ఒక ర్యాలీలో సైఫుల్లా రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. ”ఈరోజు ఫిబ్రవరి 2… 2026 ఫిబ్రవరి 2 నాటికి కశ్మీర్‌ను సీజ్ చేసేందుకు మేము చేయగలిగినదంతా చేస్తాం” అని సైఫుల్లా ప్రకటించాడు. కశ్మీర్‌లో తీవ్రవాద కార్యకలాపాలను ఉధృతం చేస్తామని హెచ్చరించాడు. గడువు (2026 ఫిబ్రవరి 2) నాటికి కశ్మీర్‌కు విముక్తి కల్పిస్తామని బాహాటంగా ప్రకటించాడు. పాకిస్థాన్ భద్రతా బలగాల వత్తాసుతో జరిగిన ఈ ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సాయుధ ఉగ్రవాదులు కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. రెండు నెలల క్రితం, పంజాబ్ (పాకిస్థాన్‌)లోని కంగన్‌పూర్‌లో జరిగిన బెటాలియన్ ఈవెంట్‌లో సైఫుల్లా ప్రసంగించాడు. ఇతనిపై అధికారులు పూలు జల్లుతూ ఘనస్వాగతం పలికారు. సైఫుల్లాకు లష్కరే నాయకత్వంతోనే కాకుండా పాకిస్థాన్ సైనిక శక్తులతో లోతైన సంబంధాలు ఉన్నాయి. పహల్గాం దాడి అనంతరం భారత భద్రతా సంస్థలు ఇప్పుడు మరింత లోతుగా సైఫుల్లా కదిలికలు, అతని చర్యలపై నిఘా ఉంచాయి.