SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 25 April 2025, 11:23 am Posted by : SHIVASURYA NEWS

ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ కన్నుమూత

జయజయహే: ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కె. కస్తూరి రంగన్ ఇవాళ అనారోగ్యంతో కన్నుమూశారు. బెంగళూరులోని ఆయన సొంత ఇంట్లోనే ఉదయం 10.43కు ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కస్తూరి రంగన్ కు 84 ఏళ్లు. ఆయన మృతదేహాన్ని అభిమానుల సందర్శన కోసం బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఆర్ఆర్ఐ)లో ఉంచనున్నారు. ఆదివారం ఉదయం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. 1994లో కస్తూరి రంగన్ ఇస్రో ఐదో ఛైర్మన్ గా నియమితులయ్యారు. 2003 వరకూ తొమ్మిదేళ్ల పాటు ఆయన ఇస్రో ఛైర్మన్ తో పాటు ఖగోళశాఖకు కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఈ కాలంలో కస్తూరి రంగన్ పలు కీలక మిషన్లలో పాలు పంచుకున్నారు. భూమి పరిశీలనకు భారత్ పంపిన రెండు ఉపగ్రహాలు భాస్కర 1,2 రెండింటికీ ఆయన ప్రాజెక్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. అలాగే భారతదేశ తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఐఆర్ఎస్-1ఏకు సారధిగా కూడా పనిచేశారు.  బోంబే యూనివర్సిటీ నుంచి సైన్స్ పట్టభద్రుడైన కస్తూరిరంగన్ కు హానర్స్, ఎమ్మెస్సీ డిగ్రీలు కూడా ఉన్నాయి. 1971లో అహ్మదాబాద్ లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్ లో పనిచేస్తున్నప్పుడు ఆయన ఎక్స్ పరిమెంటల్ హై ఎనర్జీ అస్ట్రానమీలో డాక్టరేట్ కూడా పొందారు. కస్తూరిరంగన్ ఇస్రో ఛైర్మన్‌గా పనిచేసినప్పుడు, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ తొలిసారి ప్రయోగించారు. అలాగే జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ యొక్క మొదటి విజయవంతమైన విమాన పరీక్ష కూడా ఆయన నాయకత్వంలోనే జరిగింది.