SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 25 April 2025, 12:26 pm Posted by : SHIVASURYA NEWS

ఇది అమానుష చర్య: గంటా

చంద్రమౌళికి కన్నీటి వీడ్కోలు

విశాఖపట్నం, జయజయహే : పర్యాటకులపై కాల్పులు జరపడం అమానుష చర్యని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. కశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో అసువులు బాసిన జె.ఎన్. చంద్రమౌళి భౌతిక కాయానికి పాండురంగపురంలోని నివాసం వద్ద శుక్రవారం శ్రద్ధాంజలి ఘటించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కుటుంబంతో సరదాగా గడపడానికి కశ్మీర్ వెళ్లిన చంద్రమౌళిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన వారు ఎక్కడ దాక్కున్నా మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని చెప్పారు. అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న రోజును బ్లాక్ డే గా పరిగణిస్తున్నామని తెలిపారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చలించిపోయారని, విశాఖ వచ్చి విమానాశ్రయంలో చంద్రమౌళి భౌతిక కాయానికి నివాళులు అర్పించాన్నారు. చంద్రమౌళి కుటుంబానికి అండగా ఉండాలని తమను పంపారని పేర్కొన్నారు. మంచి వ్యక్తిత్వం గల చంద్రమౌళి మరణం బాధాకరమని, ఆయన తోడల్లుడు కుమార్ రాజా, బావమరిది డీఎస్పీ నాగేశ్వరరావు తనకు మంచి మిత్రులన్నారు. స్నేహితులు, బంధుమిత్రులతో పాటు గంటా శ్రీనివాసరావు – చంద్రమౌళికి కన్నీటి వీడ్కోలు పలికారు.