పేదలకు అందించే రేషన్ సరుకుల చౌక ధరల దుకాణాలు.. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మూసివేతకు గురయ్యాయని ఆరోపించారు. వాటిని తిరిగి తెరిపించామని, డోర్ డెలివరీ సిస్టమ్ లో ఉన్న అక్రమాలకు అడ్డుకట్ట వేశామని అన్నారు. దీనిపై వైఎస్ జగన్ స్పందించారు. ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై చంద్రబాబు ప్రభుత్వానికి ఎందుకు కక్ష?, మళ్లీ పేదలకు రేషన్ కష్టాలు ఎందుకు తెస్తున్నారు? ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థలను తీర్చాలి కానీ, వారిని కష్టపెట్టడం సబబేనా? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ సేవల డోర్ డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్ అవుతుందా? అంటూ నిలదీశారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన 9,260 రేషన్ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు 20,000 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పొట్టకొట్టడం, వారి కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం?, ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? అని జగన్ ప్రశ్నించారు.
పారదర్శకంగా ఇంటి వద్దకే వచ్చి సేవలు అందిస్తూ, వరదలు, విపత్తు సమయాల్లో బాధితులకు మరింతగా సేవలందించిన ఈ వాహనాలను తొలగించడం సరైనదేనా?, పైగా ఈ సేవలందించిన వారిని ఉద్దేశిస్తూ వారు స్మగ్లర్లుగానూ, మాఫియా ముఠా సభ్యులుగానూ చిత్రీకరించేలా చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సబబుగా లేవని జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం రాకముందు ప్రతినెలా ఆహార భద్రత కింద పేదవాడికి హక్కుగా అందాల్సిన రేషన్ సహా ఎన్నో ప్రభుత్వ సేవల కోసం పడ్డ తిప్పలు అన్నీఇన్నీకావని గుర్తుచేశారు. ఎండనక, వాననక క్యూలైన్లలో రేషన్ షాపులముందు పడిగాపులు పడేవాళ్లని, ఎప్పుడు రేషన్ ఇస్తారో, ఎంతసేపు రేషన్ ఇస్తారో తెలియక కూలీపనులు, ఇతరత్రా పనులు మానుకుని నిరీక్షించేవాళ్లని చెప్పారు.
ఈ కష్టాలు పడలేక కొంతమంది రేషన్ సరుకులు తీసుకోవడంకూడా మానేశారని జగన్ పేర్కొన్నారు. దీనిపై తన పాదయాత్రలో ప్రజలు నా వద్దకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే పాలనా సంస్కరణల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థలతోపాటు, ఇంటివద్దకే రేషన్ అందించే డోర్ డెలివరీని ప్రారంభించిందని అన్నారు.
బియ్యం క్వాలిటీని పెంచి, మధ్యస్త సన్నబియ్యాన్ని, ప్రజలు తినగలిగే నాణ్యమైన, సార్టెక్స్ చేసిన బియ్యాన్ని ప్యాక్ చేసి, రేషన్ వాహనాల ద్వారా ప్రతి ఇంటింటికీ అత్యంత పారదర్శకంగా అందించి దోపిడీకి అడ్డుకట్ట వేసిందని జగన్ చెప్పారు. దేశం మొత్తం కొనియాడిన బియ్యం డోర్ డెలివరీ విధానాన్ని రద్దుచేసి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. నెలకు రూ.10,000 వేలు ఇస్తామంటూ వాలంటీర్లను తమ వైపు తిప్పుకుని ఎన్నికల్లో వాడుకున్నారని, తీరా అధికారంలోకి వచ్చాక పచ్చి అబద్ధాలు ఆడుతూ వారిని రోడ్డుమీద నిలబెట్టారని జగన్ ఆరోపించారు. హేతుబద్ధీకరణ పేరుతో గ్రామ, వార్డు సచివాలయాలపై కక్ష కట్టి అందులో ఉన్న 33,000 శాశ్వత ఉద్యోగాలకు శాశ్వతంగా సమాధికట్టారని మండిపడ్డారు. గ్రామాల్లో అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ సేవలు, ఆర్బీకేలు, సచివాలయాలు ఇలా అన్నింటినీ నిర్వీర్యం చేశారని, గ్రామాల్లో, వార్డుల్లో డోర్ డెలివరీ సంగతి పక్కనపెడితే, ఏకంగా ప్రభుత్వ సేవలు అందడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ వాహనాలపై ఆధారపడ్డ 20,000 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారని జగన్ అన్నారు. కనీసం వారికి ప్రత్యామ్నాయం కూడా చూడలేదు. మొత్తంగా మీరు అధికారంలోకి వచ్చాక వాలంటీర్లుగా పని చేస్తున్న 2.6 లక్షల మంది, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్, ఏపీ ఫైబర్ నెట్ల్లో తొలగించిన వాటితో కలిపితే మొత్తంగా మూడు లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయారుని వివరించారు.


