SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 07 May 2025, 6:16 am Posted by : SHIVASURYA NEWS

ఆలయాల్లో అన్నదానాలు

కొత్తగా 16 ఆలయాల్లో నిత్యాన్నదాన పథకం

మరో 23 టెంపుల్స్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ లు

137 ఉగ్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

దేవాదాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు

జయజయహే : దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేవాదాయ శాఖలో 137 ఉద్యోగాల భర్తీకి సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. మంగళవారం అమరావతిలో దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ సహా గ్రేడ్ 1, 3 ఈవో పోస్టులు సైతం ఖాళీలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో ఆ శాఖలో పోస్టులు భర్తీకి సీఎం ఆమోద ముద్ర వేశారు. అలాగే మరో 200 వైదిక సిబ్బంది కొలువుల నియామకాలకు సైతం ఆయన అంగీకారం తెలిపారు. ఇక నూతనంగా 16 ఆలయాల్లో నిత్యాన్నదాన పథకం అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అదే విధంగా 23 ప్రధాన ఆలయాలకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా కార్యక్రమాలు చేపట్టాలని ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. దేవాలయ భూముల్లో శాఖాహార హోటళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. ఇక ఆగమశాస్త్రం ప్రకారమే ఆలయాల అభివృద్ధి పనులు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు జరిగిన ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితోపాటు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక ఏప్రిల్ 30వ తేదీన చందనోత్సవం సందర్భంగా టికెట్లు కొనుగోలు చేసేందుకు క్యూ లైన్‌లో నిలిచిన భక్తులపై గోడ కూలిన సంఘటనలో 8 మంది భక్తులు మరణించారు. ఈ ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. అందుకు సంబంధించిన నివేదికను సోమవారం సాయంత్రం అమరావతిలో సీఎం చంద్రబాబుకు కమిషన్ అందజేసింది. ఆ క్రమంలో ఈ ఘటనకు బాధ్యులుగా ఉన్న పర్యాటక, దేవాదాయ శాఖలోని పలువురు ఉన్నతాధికారులే కారణమని సదరు నివేదికలో కమిషన్ స్పష్టం చేసింది. వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి స్పష్టమైన సూచన చేసింది. ఈ నేపథ్యంలో ఈ రెండు శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.