SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 17 May 2025, 1:56 pm Posted by : SHIVASURYA NEWS

ఆగస్టు 15 నుండి మహిళలు ఉచిత బస్సు..సీఎం చంద్రబాబు

ఏపీలోని మహిళలందరికీ టీడీపీ-జనసేన-బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభించే తేదీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలువరించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ సదుయం కల్పిస్తామని తాజాగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కర్నూలులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేయగా.. అందులో పాల్గొన్న ముఖ్యమంత్రి.. ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని ప్రజలతో ప్రమాణం చేయించారు.

మహిళలకు అండగా ఉండేందుకు ఈ పథకాన్ని తీసుకువస్తున్నట్లు ఇప్పటికే కూటమి నేతలు పదే పదే చెబుతూ వస్తున్నారు. మహిళలకు రవాణా ఖర్చులు తగ్గించడం, వారికి ఆర్థిక స్వాతంత్య్రం కల్పించి.. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తే రోజుకు సుమారు 25 లక్షల మంది మహిళలు.. ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

ఎన్నికల వేళ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఒక్కొక్కటిగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇప్పటికే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను కూడా వచ్చే నెలలోనే ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ 12వ తేదీన అన్నదాత సుఖీభవ.. తల్లికి వందనం పథకం ప్రారంభించాలని ఇటీవల జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించినట్లు.. భేటీ తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.