SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 24 May 2025, 10:27 am Posted by : SHIVASURYA NEWS

అమరావతి సక్సెస్ కాదు-మొండిగా ముందుకెళ్లొద్దు-బాబుకు పాత మిత్రుడి చింతా మోహన్ సలహా..!

ఏపీలో గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అమరావతి రాజధానిని ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా పక్కనబెట్టేసింది. తిరిగి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని పనుల్ని పునఃప్రారంభించారు. ఇప్పుడు రాజధానిలో పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే అమరావతి రాజధాని విషయంలో విపక్షాలు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఇదే క్రమంలో చంద్రబాబుకు మాజీ మిత్రుడైన మాజీ కేంద్రమంత్రి ఒకరు ఇవాళ తన అభిప్రాయం కూడా బయటపెట్టారు.
అమరావతి సక్సెస్ కాదని, కృష్ణా నదిలో రాజధాని కడుతున్నారని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ తేల్చిచెప్పేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని విషయంలో పొరపాటు చేస్తున్నాడన్నారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటున్నాడని, ఆ డబ్బు ఎవరిదని ప్రశ్నించారు. బ్యాంకుల నుంచి అప్పులు తెస్తున్నారని ఆక్షేపించారు. అమరావతిలో ఓ భవనం నిర్మాణానికి పదింతలు అదనపు ఖర్చు అవుతుందని గుర్తుచేశారు.
సెక్రటేరియట్ కోసం 50 అంతస్తుల భవనాన్ని కట్టాలనుకుంటున్నారని, భవిష్యత్తులో ఆ బిల్డింగ్ కూలిపోతే బాధ్యత ఎవరు వహిస్తారని చింతా మోహన్ ప్రశ్నించారు. అమెరికాలో వాషింగ్టన్, మలేషియాలో, అలాగే ఆస్ట్రేలియాలో ఒక మహా నగరాన్ని కట్టాలని ఫెయిలయ్యారని ఆయన తెలిపారు. ఒక మహా నగరాన్ని కట్టేముందు అందరి సలహాలు తీసుకోవాలని, మేధావులతో సంప్రదించాలని, చర్చించాలని ఆయన సూచించారు.

సొంత నిర్ణయాలు వద్దని, మొండిగా ముందుకు వెళ్లవద్దని సీఎం చంద్రబాబును ఆయన కోరారు. శివరామ కృష్ణన్ కమిటీ సిఫార్సులో ఏముందని ఆయన ప్రశ్నించారు. అమరావతిలో కట్టమని కమిటీ చెప్పలేదన్నారు. మరోవైపు పేదరికం గురించి సీఎం చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యల్ని సైతం చింతా మోహన్ ఎద్దేవా చేశారు. 2029 నాటికి పేదరికాన్ని తీసేస్తానని ముఖ్యమంత్రి అంటాడని, 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు పేదరికాన్ని ఎంతవరకు తగ్గించగలిగారని ప్రశ్నించారు. మోడీ, బాబు ఇరువురూ కలిసి గూడూరు ప్రజల చెవిలో పూలు పెడుతున్నారని, గూడూరు ప్రజలకు కావాల్సింది దుగ్గరాజ పట్టణం మేజర్ పోర్ట్ నిర్మాణమని ఆయన తెలిపారు.