SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 05 May 2025, 5:09 am Posted by : SHIVASURYA NEWS

అందరికీ అభినందనలు

ప్రధాని మోదీ అమరావతి సభ సక్సెస్

జయజయహే : రాజధాని అమరావతి నిర్మాణ పనుల పున:ప్రారంభానికి కూటమి ప్రభుత్వం రెండు రోజుల క్రితం శ్రీకారం చుట్టింది. అమరావతి పర్యాటనలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అమరావతి నిర్మాణంలో అండగా ఉంటామని మోదీ హామీ ఇచ్చారు. దాంతో.. మోదీ టూర్‌ తర్వాత రాజధాని అమరావతి నిర్మాణ పనులను ఏపీ ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా పునః ప్రారంభోత్సవం పూర్తి కావడంతో రాజధాని పనులు పరుగులు తీయనున్నాయి. ఈ క్రమంలోనే.. ఐదు ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హై కోర్టు భవనాల తుది డిజైన్లపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తాజాగా.. సీఆర్డీయే కార్యాలయంలో నార్మన్ పోస్టర్, హఫీజ్ కాంట్రాక్టర్స్, ఎల్ అండ్ టీ సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశం అయ్యారు. ఐకానిక్ భవనాల డిజైన్లు ఖరారు చేసేందుకు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పలు భవనాల డిజైన్లును మంత్రి నారాయణ, అధికారులకు ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు వివరించారు. ఇక.. 2014-2019 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించింది. అక్కడ పలు భవనాల నిర్మాణ పనుల్ని మొదలు పెట్టింది. కొన్ని నిర్మాణాల పునాదుల కోసం భారీ గుంతలు తవ్వి పనులు మొదలు పెట్టారు.. ప్రధానంగా.. అమరావతిలో సచివాలయం ఐకానిక్ భనవాల కోసం అప్పుడే ర్యాప్ట్ ఫౌండేషన్ వేశారు. అయితే.. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం.. మూడు రాజధానులు తెరపైకి రావడంతో అమరావతి పనులకు బ్రేకులు పడ్డాయి. ఈ క్రమంలో.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతి పనులు వేగవంతం చేస్తోంది. ఐకానిక్ భవనాల డిజైన్లను ఖరారు చేసి త్వరలోనే పూర్తిస్థాయి పనులు చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. టవర్ల నిర్మాణాన్ని కూడా రెండున్నర నుంచి మూడేళ్లలోపే పూర్తి చేసేందుకు సీఆర్‌డీఏ ప్లాన్‌ చేస్తోంది. రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతమవ్వడంపై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. కూటమి పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రగతికి మద్ధతుగా నిలుస్తామన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు మరింత నమ్మకాన్ని నింపాయని నేతలతో చెప్పారు చంద్రబాబు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే సభ సక్సెస్ అయిందన్నారు. సభ నిర్వహణకు సమస్త ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పని చేసిందన్న ముఖ్యమంత్రి.. సమన్వయంతో పని చేశారంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు. అమరావతి ఆవశ్యకతను వివరించేందుకే ప్రధాని మోదీ చేతుల మీదుగా పనులు పున:ప్రారంభించామన్నారు. అమరావతి ఒక నగరం కాదు… ఒక శక్తిగా మారుతుందన్న ప్రధాని మాటలు స్ఫూర్తిని నింపాయన్నారు. రాష్ట్ర వృద్ధి రేటుకు అమరావతి కేంద్రంగా ఉంటుందని ప్రధాని చేసిన వ్యాఖ్యలు భవిష్యత్ రాజధానిని ఆవిష్కరించాయన్నారు సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ ప్రసంగం ప్రజల పట్ల ఉన్న అభిమానానికి, రాష్ట్రాభివృద్ధిపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచిందన్నారు చంద్రబాబు. మరోవైపు అమరావతి పునఃప్రారంభం కార్యక్రమంపై చంద్రబాబు ట్వీట్ చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. ప్రజల సహకారం, కేంద్రం మద్దతు, పక్కా ప్రణాళికతో.. ఫ్యూచర్‌ సిటీగా అమరావతిని నిర్మిస్తామన్నారు చంద్రబాబు..